ఎంతో శ్రమ చేసి , ఎన్నో పరిశోధనలు చేసి వ్రాసినటువంటి పుస్తకం హైందవి విశ్వమంతా వ్యాపించిన భారతీయ సంస్కృతి రచయిత శ్రీ ముదిగొండ ఇందుశేఖర్ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఈ పుస్తకాన్ని మా వెబ్ సైట్ లో పెట్టడానికి అనుమతి ఇచ్చిన ముదిగొండ ఇందుశేఖర్ గారికి నా కృతజ్ఞతలు. వెబ్ సైట్ పాఠకులందరూ దీన్ని చదివి మన భారతీయ సంస్కృతిని గుర్తిస్తారు అని ఆశిస్తున్నాను
---- నండూరి శ్రీ సాయిరాం
సమీక్ష
అతి ప్రాచీనమైన హైందవ సంస్కృతి గురించి, హిందూ మతం గురించి, భారతీయుల గురించి నేటి సమాజానికి ముఖ్యంగా పాశ్చాత్త పోకడల్ని అనుసరిస్తున్న యువతరానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి మహోన్నతమైన కార్యాన్ని మొదలు పెట్టి, ఎంతో శ్రమించి పూర్తి చేసి, సఫలం చేసిన కొత్త రచయిత శ్రీ ముదిగొండ ఇందుశేఖర్ గారు తెలుగువారికి చిర పరిచితులైన పండితులు, రచయితా అయిన ముదిగొండ శివప్రసాద్ గారి కుమారులు.
ఈ ఇందుశేఖర్ గారు హైందవి విశ్వమంతా వ్యాపించిన భారతీయ సంస్కృతి అనే పుస్తకం ద్వారా తెలుగు వాళ్లకి ఎన్నో కొత్త విషయాలు తెలియజేశారు. వటవృక్షం తన శాఖలను విస్తరింపజేసి ఊడల ద్వారా క్రొత్త వృక్షాలకి చోటు ఇచ్చినట్లు మన భారతీయ సంస్కృతి ఇతర సంస్కృతులకి దారి చూపించింది అని ఈ పుస్తకంలో రచయిత సాక్ష్యాలతో, ఆధారాలతో చూపించారు. వీరు సాంకేతిక రంగంలో కంప్యూటర్ ఇంజనీర్ కావటం వల్ల పుస్తకమంతా శాస్త్రపరమైన, వైజ్ఞానిక పరమైన రుజువులతో పాఠకుల మనస్సులో ఎటువంటి సందేహాలు లేకుండా శ్రద్ధ వహించారు. ఎంతో శ్రమతో దేశమంతా సందర్శించి పరిశోధించి, ఉదాహరణలతో, ఛాయా చిత్రాలతో ఆ పుస్తకాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. మరి ఆ పుస్తకం చివరలో వారు ఉపయుక్త గ్రంథసూచి, వెబ్ సైట్ వివరాలు పాఠకులకు ఆధారాల కోసం అందించారు.
చరిత్రలో ఏమి జరిగి ఉండాలి? అన్నమొట్టమొదటి శీర్షిక మనకి కుతూహలం కలిగించి చివరి వరకు పుస్తకం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. రచయిత అంచనా ప్రకారం మహాభారతయుద్ధం తర్వాత భారతీయులందరూ వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళారు. అంతకు ముందు ప్రపంచ సంస్కృతి మరియూ భారతీయ సంస్కృతి ఒక్కటే. స్థాన, కాల, వాతావరణాల వల్ల ఆయా దేశాల సంస్కృతులుగా మార్పు చెందినాయి. రచయిత ఆసియా ఖండంలో థాయిలాండ్, కంబోడియా, పాళీ, సుమాత్రా, చైనా, కొరియా, జపాన్ తో మొదలు పెట్టి ఇండోనేషియా, యూరోప్ లో రష్యా, ఈజిప్ట్,ఇరాన్,ఇరాక్, దక్షిణ,ఉత్తర అమెరికా ఖండాలు,మెక్సికో ఇలా ఈ దేశాలలో ఆచారాలు మన భారతీయ సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తాయో ఈ పుస్తకంలో రచయిత వివరించారు. అదే విధంగా క్రైస్తవ, బౌద్ధ, ఇస్లాం మతాలూ హిందూ మతాన్ని ఆధారముగా తీసుకుని రూపొందించిన మతాలని రచయిత ఆధారాలతో పేర్కొన్నారు. శ్రీ ముదిగొండ గారి శ్రమ, కృషి ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి మన దేశపు గొప్పతనాన్ని గుర్తించి ప్రపంచానికి చాటు చెప్పాలి.
శ్రీ నండూరి సాయిరాం గారు ఈ పుస్తకాన్ని నాకిచ్చి, దాన్ని చదివి, విశ్లేషించి నా అభిప్రాయాన్ని శ్రీ దత్త వెబ్ సైట్ పాఠకులకు (రీడర్స్) వివరించమని చెప్పారు. వారు, మేమూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి, మన హైందవ సంస్కృతి గురించి తరచుగా చర్చించుకుంటాము. నాకీ అవకాశం ఇచ్చి, నన్ను ప్రోత్సహించినందుకు శ్రీ సాయిరాం గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు.
-- నాథవజుల శ్రీ లలితా పవన్ కుమార్