N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday 31 January 2017

Gayatri Mantra Mahima-1


ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు

గాయత్రి మంత్ర మహిమ 

ఉత్తర ప్రదేశ్ లో ఒక గ్రామంలో ఒక సంపన్న జమీందారి కుటుంబం ఉంటుండేది. కుటుంబానికి యజమాని అయినటువంటి విష్ణు శర్మ గారికి ఊళ్ళో మంచి పేరు ఉండేది. సంస్కృతంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఆయన ఎంతో కృషి చేసారు. వేదాల్లో ఆయనని ఒకరుగా భావించ బడుతుండేవారు. ఊళ్ళో ఒక పెద్ద మనిషిలాగా ఆయన వ్యవహారిస్తుండేవారు. స్వతహాగా జమీందారు కావడం వాళ్ళ, పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్ల సాధారణంగా అక్కడ పండిత సభలు జరిగినప్పుడు చాలా మంది మేధావులు, పండితులు అయినట్టి  వక్తలు తరుచుగా బయటనుంచి వచ్చినప్పుడు వారంతా వీరింటిలోనే మకాం వేస్తుండే వారు

Tuesday 24 January 2017

Spiritual Soup-15

ధ్యానము - ఆధ్యాత్మిక భూమికలు (Dimensions)

లోబ్సంగ్ రంపా (Lobsang Rampa) గారి దర్శనము మరియు అయస్కాంత వ్యక్తి   దర్శనము, వారు  చెప్పిన మాటలు పదేపదే మననం చేసుకుంటూ నా నిత్యకృత్యాలలో మునిగిపోయాను. వారు ఆదేశించినట్టుగానే ధ్యానప్రక్రియ మొదలుపెట్టాను, కాని ఎంత ప్రయత్నించినా కూడా ధ్యానం మీద మనస్సు నిలిచేది కాదు. ధ్యానం మొదలుపెట్టగానే మనస్సు పరిపరివిధాలా పరిగెట్టేది, ఎన్నోసార్లు అభ్యంతర విషయాలపైకి కూడా వెళ్తుండేది. మనస్సు యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతివ్యక్తీ కూడా ఎల్లవేళలా వర్తమానాన్ని వదిలి భూత, భవిష్యత్ కాలాలోనే జీవిస్తూ ఉంటాడు. భూతకాలంలో జరిగిన మంచికన్నా ఎక్కువగా చెడునీ, మనస్సుకి కష్టం కలిగించే విషయాలనే తలచుకుంటూ, ఏ వ్యక్తి వల్ల అలా బాధపడాల్సి వచ్చిందో ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ, వారిని నిందిస్తూ ఉంటారు. భవిష్యత్తులో కూడా ఇలాగే చెడు జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. కాని పొరబాటున కూడా మంచి గురించి ఆలోచించకుండా అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతుంటారు. దీని మూలంగా వారిలో చెడుస్పందనలు కలుగుతూ ఉంటాయి. నిజానికి ఎవరైతే  వర్తమానకాలములో జీవిస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అది కాకుండా భూత, భవిష్యకాలంలో కూడా ఎవరు మంచి విషయాలు ఆలోచిస్తారో వారు మంచిస్పందనలు కలిగి ఎప్పుడూ సంతోషముగా ఉంటారు. కాని సగటు మానవుడు మాత్రము ఎప్పుడూ జరిగిపోయిన చెడూ, జరగబోయే చెడుని గురించ ఆలోచిస్తూ ఉండడము వల్ల మనస్సు నిలకడగా ఉండదు. అందుకనే మన పూర్వీకులు ఎప్పుడూ సత్సంగాలలో పాల్గొనడమో, మంచిపుస్తకాలు, ఆద్యాత్మిక పుస్తకాలో లేక మంచిపనులతో మనని ప్రభావితము చేసే   మహానుభావుల జీవితచరిత్రలో చదువుతూ ఉండేవారు. ఒక్కక్కసారి సినిమాల్లో చూపబడే భయంకరదృశ్యాలో లేక శృంగార సన్నివేశాలో చూసినప్పుడు మన మనస్సు వాటిచుట్టే తిరుగుతూ ధ్యానం మీద నిలకడ ఉండదు. ఇలాంటి కారణాల వల్లే కాబోలు నా మనస్సు నిలకడగా ఉండట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కక్కసారి మనస్సు అనవసరమయిన ఏ విషయాలు ఆలోచించకుండా ఉంటే ప్రశాంతముగా ఉంటుంది. అందుకనే సాధ్యమైనంతవరకు అవతలివ్యక్తుల సంభాషణలు నాకు నచ్చకపోతే వారికో నమస్కారం పెట్టి దూరంగా వెళ్ళిపోతాను. దాని మూలంగా వారి ప్రభావము నామీద పడకపోవడంవల్ల ధ్యానం కాస్త దారిలో పడుతుంది.

అలా నా ధ్యానం కొన్నిరోజులకి ఒక దారిన పడి నా మనస్సు ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఆలోచనలు లేవు. అలా ఉండగా ఒక రోజు నాకు మళ్ళీ అయస్కాంత వ్యక్తి దర్శనమయింది. అయితే చాలా తరచుగా అతను కనిపిస్తుండడం వల్ల మనస్సులో ఉత్సాహం ఉన్నా అది పైకి కనిపించని స్థితికి వచ్చాను. నన్ను చూసి ఆయన ఇలా అన్నారు, “నాయనా! నీవు మంచి స్థితికి వచ్చావు. ఇదివరకు ఎప్పుడూ ఏదో ఆందోళనగా, ఆలోచిస్తున్నట్టుగా ఉండేవాడివి. దాని మూలంగా భావతరంగాలలో మునిగి నీ దగ్గరలో ఉన్న నన్ను చూసేవాడివి కావు. ఇప్పుడు నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది”.  “ఇదివరకు కలసినప్పుడు మీరేన్నోవిషయాలు నాకు చెప్పారు. అవి అప్పుడు అర్థమయినట్టుగా అనిపించినా తర్వాత ఆలోచిస్తే కొన్ని అర్థం అయినట్లుగా లేవు. డైమెన్షన్స్ (Dimensions) అంటున్నారు, కాస్త ఈ డైమెన్షన్స్ ఏమిటో వివరంగా చెప్తారా” అని అడిగాను. “చాలా మంచి ప్రశ్న వేసావు నాయనా! కాని ఇక్కడ చిన్న చిక్కు ఉంది. పరమగుప్తమైన ఈ ఆధ్యాత్మిక విషయం మీ స్థాయికి దిగి వచ్చి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనేది అతికష్టమైన ప్రక్రియ. సంక్షిప్తమయిన భావాలకి సరయిన భాష కాని, పదాలు కాని మీ భాషలో ఉండవు. అందుకనే మేము చెప్పేది ఒకటయితే మీరర్థం చేసుకునేది ఇంకొకటి అవుతుంది. లోగడ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు వ్రాసినవారు సాధారణ మనుషులే కాని వారు ఉన్నతస్థాయిలో ఉండి వ్రాసిన పుస్తకాలు అవి. ఆ రోజుల్లో ఇప్పటిలాగా ప్రింటింగ్ సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లో ప్రింటింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల విషయజ్ఞానం ఒకరినుండి ఒకరికి శ్రుతిద్వారా వ్యాప్తి చెందుతుండేది. ఎంత బాగా చెప్పినా, అర్థమయినా ఒకరు చెప్పినదానికి ఇంకొకరు చెప్పినదానికి చాలా తేడా ఉండడంతో ప్రజలు సందిగ్ధావస్తలో ఉండేవాళ్ళు. ఆధ్యాత్మిక విషయాలు నీ స్థాయికి దిగి నీకర్థం అయ్యేలా చెప్పడం తప్పదు కాబట్టి సాధ్యమైనంతవరకూ నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏ విషయమైనా కథల రూపంలో చెప్తే ఆసక్తిగా విని అర్థం చేసుకుంటారు. కాని ఆ కథలో ఉన్న నీతిని గురించి కాని దాన్ని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించరు. అయినా సరే నీవడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను.

లౌకికమూ, అలౌకికమూ అనే పదాలు నీకు తెలుసు కదా. అలౌకికము అంటే మాకు సమయము, ప్రదేశము అనేవి ఉండవు. అన్నీ కలిపి టైం అండ్ స్పేస్ అని చెప్తారు.  టైం అండ్ స్పేస్ అనే కాన్సెప్ట్ మాకు ఉండదు. అది మీ భాషలో చెప్పినా మీకర్థం కాదు. ఏ విషయాన్నయినా మీకు ముక్కలు, ముక్కలుగా చేసి , చిన్న భాగాలుగా చెప్పితే  కాని అర్థం కాదు.” అని అన్నప్పుడు నేను “మహాత్మా ! ముక్కలు ముక్కలు ఏమిటీ ? చిన్న భాగాలు ఏమిటీ నాకు అర్థం కాలేదు” అని చెప్పగా ఆయన నవ్వి “అదే చెప్పుతున్నాను, విను. ఉదాహరణకి కాలం అనేది ఒక ప్రవాహం. అది బ్రహ్మాండమయిన  మహా చైతన్య శక్తి, నిరంతరమూ సాగిపోతూనే ఉంటుంది. మీకు కాలం ఇలా వెళ్ళిపోతుంది అని చెప్తే అర్థం కాదు కదా అందుకనే దాన్ని సంవత్సరాలు, నెలలు,వారాలు, దినాలు, గంటలు, సెకన్లుగా విభజించాము. నిజానికి కాలం అలా ముక్కలు ముక్కలుగా ఉండదు. అది నిరంతరమూ ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటుంది.అందుకనే మీ స్థాయికి వచ్చి మీకర్థంయ్యేట్టుగా లీనియర్ భాషలో చెప్పాల్సి వస్తుంది. మీ ఆలోచనలు ఒక రేఖ (లైన్) లాగా ఒకే డైమెన్షన్ లో ఉంటాయి అందుకనే మీకదే డైమెన్షన్లో  చెప్పాల్సి వస్తుంది.మీలో కొంతమంది నిరంతర సాధన వల్ల మా స్థాయికి చేరుకోగలుగుతారు. వారికి  భాషతో ప్రమేయం ఉండదు, నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉంటారు” అని వివరించారు.  “మహాత్మా! నాకు ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థం అవుతుంది కాని ప్రతీసారి డైమెన్షన్స్, లోవర్ డైమెన్షన్స్, అప్పర్ డైమెన్షన్స్ అంటారు. అవి ఏమిటీ ? ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? అని అడగగా “నాయనా ! నిజానికి డైమెన్శన్స్ లో ఎన్నో రకాలు ఉండవు. కాలాన్ని గురించి లీనియర్ భాషలో ఎలా చెప్పానో అలాగే ఈ భూమికల గురించి కూడా నీకర్థంయ్యేట్టుగా చెప్తాను.  ఉదాహరణకి అక్షరాభ్యాసం చేసినప్పుడు మీరు పలకా బలపం పట్టుకుని అక్షరాలు నేర్చుకుంటారు. తర్వాత పెద్దయ్యాక మీకు భౌతికంగా వాటిని పట్టుకోనవసరం లేదు. అన్ని చదవగలుగుతారు, అంటే ఏమిటి ? మీరు పై స్థాయికి వచ్చినట్లే. ఆ స్థాయికి తగ్గట్లు మీరు చదువుకుంటారు. పైస్థాయికి వెళ్ళినప్పుడు మీరు ఏవైతే భౌతికంగా పలక మీద రాసారో అవి మీ మెదడులో కాని, మనస్సులో కాని ప్రతిష్టించి పోయి ఉంటాయి. అవి జ్ఞానము అనే చైతన్య స్థాయిలో ఉంటాయి.మీ శక్తి సామర్త్యాలని బట్టి మీరు ఏ భూమికలో ఉన్నప్పుడు ఆ భూమికకు తగ్గట్టుగా విషయం చెప్పబడుతుంది. ఒకటవ తరగతిలో చదువుతున్న విద్యార్థికి వృక్ష శాస్త్రము, జంతుశాస్త్రమో చెప్తే అర్థం అవుతుందా ?కాబట్టి భూమికల గురించి చెప్పాల్సి వచ్చింది. అంతే కాని లేక పొతే మీకర్థం కాదు. ఇంకా చెప్పాలంటే 1,2,3........10వ తరగతి ,కాలేజి విద్యలో, ఉన్నత విద్యలు అంటూ మీరు భౌతిక రూపంలో ఉన్న విషయాలు చదువుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు   వాటి గురించి విస్తారంగా తెలుసుకోవాలంటే మీరున్న తరగతి నుంచి పై తరగతికి వెళ్ళాలి, అలా వెళ్లినపుడే  అవి మీకు అర్థం అవుతుంటాయి. అయితే మీరు క్రింద భూమికనుంచి పై భూమికకి వెళ్ళినప్పుడు మీ భూమికను బట్టి సరి అయిన పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి విషయం మీకు సరిగ్గా అర్థమవుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మికంలో కూడా ఉంటుంది” అని చెప్పారు. అప్పుడు “మహాత్మా ! కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇంకా మీరు దాని గురించి వివరంగా చెప్తారా” అని అడిగాను. ఆయన నవ్వి “సరే ! ఇంకా వివరంగా చెప్తాను” అని అన్నారు. “అయితే మానవులకి విజ్ఞానము అక్షరరూపంలో ఉంటుంది. మీరు మొదట్లో బడికి వెళ్ళినప్పుడు తెలుగులో అ,ఆ ,ఇ,ఈ లు,ఇంగ్లీషులో ఎ,బీ, సి, డి, లు అని చదువుతారు. దీన్నిబట్టి విజ్ఞానికి ఒక ఆకారం ఉంది అని తెలుస్తుంది. మీరు అమ్మ ,ఆవు అన్నప్పుడు మీకు మీ అమ్మగారు ,ఆవు ప్రత్యక్షమవుతారు. దీనివల్ల మీకేం తెలుస్తుంది ? అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచాలంటే నిరాకారంగా ఉన్నదానికి ఒక ఆకారం కలిపించి చెప్తేనే మీకర్థం అవుతుంది”. అవును మహాత్మా ! ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. ఆ అక్షరాలను బట్టి మేము చదువుతాము.” “అంటే ఏమిటి మీరిప్పుడు చదివే అక్షరాలు ఒకప్పుడు అవి అక్షరాలుగా రానప్పుడు ఒక అవ్యక్తస్థితిలో ఉన్న శక్తిగానే  (invisible energy ) మీరు గమనించాలి. అంటే ప్రతి అక్షరంలో జ్ఞానము ఉంది, అది అవ్యక్తస్థితిలో ఉన్నపుడు  దాన్నే మనము చైతన్యశక్తి అని అంటాము . మీరు ఏదైనా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న అక్షరాలూ , గీతలూ, బొమ్మలు మొదలైన సంకేతాలను బట్టే చదువుతారు కదా ! ఆ సంకేతాలని చదువుతూ ఉంటే మీరు ఆ చైతన్యంలో ఒక భాగమై జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానమూ, విజ్ఞానమూ ఏవైతే ఉన్నాయో అవి ఒక మహా చైతన్య స్థితిలో ఉన్నాయి.”

“మహాత్మా, ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది” అని అన్నాను. దానికి ఆయన “నీవు ఎప్పుడైనా ఏ విషయాన్నైనా సరే విశ్లేషించుకోవాలి విమర్శించుకోవాలి. గురువులనే వారు ప్రత్యేకంగా ఉండరు, మీలోనే ఒక గురువుని భగవంతుడు ప్రతిష్టించాడు”  అనగా నేను “కొంచెం వివరించి చెప్పండి మహాత్మా” అని అడుగగా “నాయనా, ప్రతి మనిషిలో కూడా ఏ విషయమయినా ఒకే ఒకే కోణంలో మరియు  వివిధ కోణాల్లో చూసే సామర్ధ్యం ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సింగిలారిటి ఉంటుంది అంతే కాకుండా మల్టీ డైమెన్షనల్గా  కూడా ఆలోచిస్తారు. మీరు కేవలం ఒకే భూమికలో ఉండి ఆలోచించారు, అప్పుడప్పుడు పైభూమికలలో కూడా వెళ్ళుతూ ఉంటారు. ఎవరైతే ఈ పైభూమికలలో  ఉండి అనుసంధానం కావించబడతారో వారికి ఎప్పటికీ అర్థం కాని విషయాలు అర్థం అవుతాయి.

పై భూమికలో వెళ్ళడం అంటే ఏమిటీ ? ఆ భూమికలో ఉన్న విషయజ్ఞానాన్ని గ్రహించడం, అంటే నేను ఇదివరకే చెప్పినట్లుగా క్రమక్రమంగా ఆధ్యాత్మిక స్థితిలో పైభూమికల్లో చేరుతుంటారు. అంటే మీలో ఏకాగ్రత పెరిగినప్పుడు, మంచి విషయాల గురించి   ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కసారి పైభూమికలో వెళ్ళుతూ ఉంటారు.”
“అయితే మహాత్మా ! మాలోనే కొంతమందిని ఋషులూ, యోగులూ,సిద్ధులూ  అని అంటారు మరి తేడా ఏమిటీ ?” అని అడిగాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు “నాయనా. మీకు వారికి తేడా ఏమి లేదు. వారు కూడా మీ స్థాయినుంచి పైస్థాయికి వచ్చినవాళ్ళే. కాకపొతే మీకు వారికి తేడా ఏమిటంటే మీరు అప్పుడప్పుడు పై భూమికల్లోకి వెళ్లి అక్కడ మహా చైతన్య శక్తితో అనుసంధానించబడి ఎప్పటికి అర్థం కాని విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. కాని అదే స్థితిలో మీరు ఎప్పుడూ ఉండరు. మామూలు స్థితికి వచ్చినప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలకు అనుగుణంగానే మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కాని మీలో ఉన్న మామూలు మానవులే పైభూమికలో వెళ్ళినప్పుడు మహాచైతన్య శక్తితో నిరంతరమూ అనుసంధానించబడతారు కాబట్టి ప్రకృతిలో ఒక భాగామవుతారు. ప్రకృతి కూడా వారికి అనుగుణంగానే ఉంటుంది” అని వివరించారు. “కాని మహాత్మా !  విషయం పూర్తిగా అర్థమయినట్లుగా లేదు. కొంచెం స్పష్టంగా వివరిస్తారా, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి” అని అడుగగా,
నాయనా ! నీకు మొదలే చెప్పాను. పై స్థాయిలో ఉన్న విషయాలు మీ స్థాయిలో  చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని.  అందుకు తగిన భాష ఉండదు.అయినా నీకు నేను   తప్పకుండా చెప్తాను”
అని చెప్పి ఆయన ఒక్క క్షణం ఆగారు. “నాయనా జాగ్రత్తగా విను.నేను చెప్పినట్లే భగవంతుని యొక్క మహాచైతన్యశక్తి , పరిశుద్ధమైనటువంటి శక్తి ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మానవులలో ఎవరికైతే భేదభావాలు ఉండవో , సుఖదు:ఖాలని ఒకే రీతిగా భావిస్తారో, ఎవరికైతే వీరు మంచివాళ్ళు, వీరు చెడ్డవాళ్ళు , అంటరాని వాళ్లు, దుర్మార్గులు అనే భావన ఉండదో వారి మానసికశక్తి చాలా పరిశుద్ధంగా ఉండడమే కాకుండా ప్రకాశవంతంగా ఉంటుంది. అటువంటి ప్రకాశవంతమైన శక్తి ఎప్పుడైతే ఉంటుందో  వారు ఈ మహాచైతన్యశక్తితో అనుసంధానం కావించబడతారు.


అటువంటివారు మహిమలూ, లీలలూ అని ప్రత్యేకంగా వాటి వెంటపడరు. కాని ఈ మహిమలు ,అష్టశక్తులే వారి వెంటపడుతుంటాయి .ఆ మహానుభావులు అటువంటి శక్తికి లొంగక నిరతరమూ వారు ఈ చైతన్యశక్తితో అనుసంధానం కావించబడతారు. ఎటువంటి వికారాలు వారికి ఉండవు”, అని ఆయన వివరించారు. అప్పుడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు “నీకు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాను. ఇవన్నీ ఒక్కసారిగా అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మరొక్కసారి విమర్శన చేసుకుని నీలో నువ్వే ప్రశ్నించుకో. నీలో ఒక అంతర్మధనం కలగాలి. కనుక నేను చెప్పిన విషయాలు ధ్యానపరంగా ఆలోచించు.నీవు ఎలాగో స్వాధ్యయనం చేస్తున్నావు కదా. దాని వల్ల నీకు ఎన్నో మంచి విషయాలు అర్థమవుతుంటాయి. ప్రస్తుతం నేను చెప్పిన విషయాలు విమర్శన చేసుకో” అని చెప్పి అయస్కాంత వ్యక్తి అదృశ్యమైపోయారు.

నాకు ఇదంతా కొంచెం అర్థమయినట్టుగా కొంచెం అర్థం కానట్టుగా ఉంది. ఏ విషయమైనా మనం చదివినప్పుడు పదిసార్లు మననం చేసుకుంటే కాని అర్థం కాదు. చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలోని విషయాలు మన మాస్టారుగారు చెప్తే ఒక్కసారికే మనకి అర్థం అయిపోయేవా? పదే పదే మనం చదివినప్పుడు మనకి అర్థం అయ్యేవి. ఒక్కొక్కసారి వేరే ఎవరైనా చెప్తే అర్థం అయ్యేవి కదా. ఈవిధంగా నేను ఆలోచిస్తూ అయస్కాంత వ్యక్తి మాటలు విమర్శించుకోవడం మొదలు పెట్టాను. అయస్కాంత వ్యక్తితో జరిగిన సంభాషణలను నేను పదే పదే మననం చేసుకుంటూ ఇంకా ఆయన చెప్పిన సమాధానాల్ని ఎక్కడ ఎలా విశ్లేశించుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నాలో ఉన్న ఏ గురువు కూడా అన్ని విషయాలు విశదీకరించి చెప్పరు. ఒక మార్గానికి నాలుగు మూలలు, నాలుగు దిక్కులు ఉంటే కేవలం ఒక్క మూల కాని, ఒక్క దిక్కు గాని చూపిస్తారు. దాన్ని బట్టి మిగతా దిక్కులని, మూలలని మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఏ విషయము నిర్ధారణ చేసుకోవాలన్నా స్వానుభవం వల్ల ఒక ధృఢ నిర్ణయానికి కాని అభిప్రాయానికి కాని రావడం జరుగుతుంది.
ఏదో రోజులయితే గడిచిపోతున్నాయి, నా ధ్యానం సాఫీగా సాగటం లేదు. ఒక ప్రశ్నకి సమాధానం దొరికితే అందులోనుంచి ఇంకొక ప్రశ్న, అందులోంచి ఇంకొక ప్రశ్న, ఇలా గొలుసులలాగా పుట్టుకొస్తున్నాయి. పాపం! మనుష్యుల జీవితాలు ఇంతే కదా అని పరిపరివిధాలా ఆలోచిస్తున్నాను. మరి ఆయనేమో ఎవ్వరి గుణదోషాలు చూడవద్దు, పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి అని అన్నారు. భగవంతుని మహాచైతన్యశక్తి అని అంటున్నారు.దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి. వేరే వాళ్లకి చెప్తున్నప్పుడు వారికి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఆలోచిస్తుండగా అనుకోకుండా నా దృష్టి "ఒక యోగి ఆత్మ కథ " (Autobiography of a yogi) మీద పడింది. 1971-72 సంవత్సరంలో నేను ఆ పుస్తకం చదవడం, ఆ తర్వాత యోగాడా సత్సంగ్ సొసైటీ లో దీక్ష తీసుకోవడం గురించి ఇదివరకే చెప్పాను. ఆ పుస్తకం చదువుతుండగా అందులోని ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నాకు అర్థం అయింది. మనుష్యులకి ఏ విషయమైనా ఉపన్యాస ధోరణిలో కాకుండా కథల్లాగా చెప్తే తొందరగా అర్థం అవుతుంది, హృదయానికి హత్తుకుపోతుంది అని. అలాంటి ఒక ఘటన గుర్తుకి వచ్చింది. అది ఏమనగా గురుపరంపరలో అంటే యోగాడా సాంప్రదాయంలో మొట్టమొదటి గురువు మహావతార బాబాజి గారు. ఆయన్ని చాలా మంది దత్తాత్రేయుడిలాగానే భావిస్తుంటారు. ఆ మహావతార బాబాజిగారి ప్రియశిష్యుడు శ్రీ లాహిరి మహాశయులు, ఆయన శిష్యుడు శ్రీ యుక్తేశ్వరగిరి, ఆయన శిష్యుడు శ్రీ పరమహంసయోగానందగారు. లాహిరి మహాశాయులు గారు ఆయన గురువుగారిని ఎన్నో సార్లు చూడడం జరిగింది కాని యుక్తేశ్వరులుగారు ఆయన దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకసారి గురువైన లాహిరి మహాశయులు గారు వారికి కాశిలో కుంభమేళ జరుగుతుంది నీవు వెళ్ళు అన్నట్టుగా టెలీపతి ద్వారా చెప్పారు. అది విని యుక్తేశ్వరులుగారు చాలా సంతోషపడి కుంభమేళయాత్రకి వెళ్ళారు. అయితే ఆయన మనస్సు మటుకు బాబాజీ గారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రుతగా ,ఆదుర్దాగా ఉంది. అనుకోకుండా ఆయన దృష్టి దూరంగా ఉన్న ఒక వ్యక్తి మీద పడింది. వెంటనే యుక్తేశ్వరగిరిగారికి ఆయన ఎవరో కాదు సాక్షాత్తు బాబాజి గారే అని అర్థమయింది. అక్కడ ఆయన ఒక కపట సన్యాసికి సేవ చేస్తున్నారు (అతను ఉత్త మోసగాడు , కపట సన్యాసి అని అందరికీ తెలుసు) యుక్తేశ్వర్ గారు కూడా ఒక్క క్షణం ఆశ్చర్య పోయారు. దైవ సమానమైన ఆ బాబాగారు ఈ కపట సన్యాసికి సేవ చేయడం ఏమిటీ అనే ఒక ప్రశ్న ఆయన మనస్సుకి వచ్చింది. దానికి సమాధానంగా బాబాగారు పంపిన వాణి కూడా అర్థం అయింది. ఆయన ఇలా చెప్పారు “నీ దృష్టిలో ఇతను కపట సన్యాసి కావచ్చు కాని నాకా భావన లేదు. ఇతను భోజనం చేసిన పాత్రలు నేను శుభ్రంగా కడిగి భ క్తిశ్రద్ధలతో ఈ బట్టతో తుడుస్తున్నాను, అంతేకాదు ఆయన విడిచిన మైలబట్టలు కూడా ఉతుకుతున్నాను. కూరగాయలు కొని వంట కూడా చేసి పెడ్తున్నాను”. అయితే యుక్తేశ్వరులుగారు మహాజ్ఞాని కాబట్టి తన తప్పు తెలుసుకున్నారు. ఇదే కాబోలు గుణదోషాలు ఎంచకూడదు అంటే అని నాకిప్పుడు ఈ కథ ద్వారా స్పష్టం అయింది. ఈ విధంగా విమర్శన చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ దైవికశక్తి మనకు సహాయం చేస్తూ ఉంటుంది అది పుస్తక రూపంలో కావచ్చు వేరే ఏదైనా రూపంలో కావచ్చు మరి ఇంకొక విషయం కూడా నాకు అర్థమయింది. అది ఏమిటంటే జ్ఞానము అనేది ఒక మహా చైతన్యము. అది అంతరాంతరాలలో అవ్యక్త స్థితిలో ఉంటుంది అందుకే దానిని మహానుభావులు ప్రకాశంతో పోల్చారు. అది ఒక అవ్యక్త రూపంలో ఉన్నప్పుడు ఒక ధ్వని రూపంలో బయటపడ్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రధానమైనవి రెండే రెండు. వీటి వల్లే ఈ జగతి నడుస్తుంది అని నాకు అనిపించింది. ఒకటి విషయపరిజ్ఞానము అంటే ప్రకాశము, రెండవది ధ్వని (వ్యక్తస్థితిలో ఉన్నప్పుడు అది శక్తిరూపంలో మారినప్పుడు ధ్వనిరూపంలో బయటకు వస్తుంది) ఎవరైతే ఈ ప్రకాశాన్ని, ధ్వనినీ రెంటినీ సమన్వయపరచి అర్థం చేసుకుంటారో వారికి భగవంతుడి తత్త్వం పూర్తిగా అర్థం అవుతుంది అని నేను గ్రహించాను. అయితే మనకి కూడా ఏ అరిషడ్వర్గాలు లేనప్పుడే మనకి ఎదుటివారిలో లేని పోని గుణాలు కనిపించవు .

ఇదే సందర్భంలో నాకు ఇంకొక ఉదాహరణ త్రైలింగస్వామి గారిది, ఒక యోగి ఆత్మ కథలో చదివాను అది జ్ఞాపకం వచ్చింది.ఆయన కూడా ఒక యోగి, వారణాసిలో ఉంటుండేవారు. ఎప్పుడూ ఆ భగవంతుని యొక్క చైతన్యశక్తితో అనుసంధానించబడి బ్రహ్మానందస్థితిలోనే ఉండేవారు. ఎప్పుడూ అలౌకిక ప్రపంచంలోనే ఉంటూ, దిగంబరంగా తిరుగుతూ ఉండేవారు. వారణాసిలోనే ఒక ధూర్తుడు కూడా ఉండేవాడు.అతను సున్నపు భట్టిలో పని చేస్తూ ఉండేవాడు. ఈ స్వామిని చూసి ఎప్పుడూ వెటకారంగా మాట్లాడుతుండేవాడు. ఒకసారి ఆయనని ఆట పట్టించాలని ఆలోచించి మహాఆదరంగా ఆహ్వానించి సున్నపు నీటిని ఇచ్చి “ఒక గ్లాసు మజ్జిగ త్రాగండి” అని ఇచ్చాడు. మనస్సులో ఆనంద పడుతూ పైకి మటుకు “త్రాగండి స్వామి! ప్రత్యేకంగా మీకోసం తయారు చేసాను” అని అన్నాడు. స్వామి సరే అని త్రాగడం మొదలు పెట్టారో లేదో ఆ ధూర్తుడు “మంటలూ ! మంటలూ !” అని గట్టిగా అరుస్తూ, గంతులు వేస్తూ “స్వామీ ! రక్షించండి”  అని ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు. బ్రహ్మానంద స్థితిలో ఉన్న ఎవరినైనా మనం బాధపెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాధ వాళ్లకి తగలకుండా మనకే తగులుతుంది అని నాకర్థమయింది. స్వామీజీ కొంచెంకూడా కోపం రాలేదు. “నాయనా, ఇలాంటి పనులు ఎన్నడూ చేయవద్దు.అందరిలో భగవంతుడు ఉన్నాడు” అని చెప్పారు. స్వామి వారు అతనికి ఎప్పుడైతే అభయం ఇచ్చారో అప్పుడు వెంటనే అతని బాధ తగ్గిపోయింది.

ప్రతి మనిషిలో కూడా భగవంతుడు చైతన్యస్థాయిలో ఉంటాడు. ఆ చైతన్యం ప్రతి మనిషిలో ప్రతిబింబిస్తుంది.  విషయపరిజ్ఞానం లేని వాళ్ళలో చైతన్యం మాయ అనే తెరలో కప్పబడి ఉంటుంది.ఎవరైనా మహాత్ములకి అపకారం చేసినప్పుడు దాని ఫలితం వాళ్ళ మీదకే వస్తుంది. అంటే మీలో ఉన్న బ్రహ్మపదార్ధం నాలో ఉన్న బ్రహ్మ పదార్ధం ఒకటే కాబట్టి నేనేవరికైనా అపకారం చేయాలని దెబ్బ కొట్టినప్పుడు అది నాకే తగిలి నన్నే ఎవరో దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తుంది. మనం భౌతికంగా ఆ బాధను అనుభవించకపోయినా బాధామయమైన స్పందన కలిగి ఎవరైతే కొట్టారో వారిలో ప్రతిష్టమైపోయి ఏదో ఒక రూపంలో బయటికి వస్తాయి. ఆ బాధ స్వయంగా అనుభవించే దాకా ఎదుటివారిని ఎంత బాధపెట్టాడో అర్థము కాదు. అందుకని మనం ఎవరిని కూడా అనవసరంగా బాధించకూడదు అని నాకు అర్థం అయింది. గుణదోషం ఉండకూడదు అంటే ఇదన్నమాట అని చెప్పి నేను విమర్శించుకున్నాను. ఒక విధంగా నాకు ఇటువంటి కథల వల్ల అయస్కాంత వ్యక్తి చెప్పిన మాటలు అర్థం చేసుకోవడం జరిగింది.


Monday 23 January 2017

Spiritual Soup-14


స్పిరుచ్యువల్ సూప్ 14

ప్రతీ గురువారం మేము ఎవరో ఒకరి ఇంట్లో కలిసి గంటసేపు దత్తాత్రేయుడు, షిరిడీ సాయిబాబా, ఆధ్యాత్మిక గురువుల గురించి మాట్లాడుతూ ఉండేవాళ్లం. అందులో ఒక పదిహేను నిమిషాలు వేదాంతం, షిరిడీ సాయిబాబా చరిత్ర, గురు చరిత్ర, దత్తపురాణానికి సంబంధించిన చర్చ కూడా నడుస్తూ ఉండేది. కుంబ్లే, అనిల్, చారిగారు మా ఆధ్యాత్మిక బృందంలో సభ్యులు. ఒకసారి ఈస్టర్ పండుగ ముందు కుంబ్లేగారు ఫోన్ చేశారు. కుంబ్లేగారు ఒక ఇటాలియన్ టూరిస్ట్ కంపెనీలో కంప్యూటర్ డివిజన్లో పని చేస్తూ ఉండేవారు. నేషనల్ పార్కులో ఉన్న తమ కార్యాలయంలో రెండు కంప్యూటర్లలో సమస్య వచ్చింది, దాన్ని బాగు చేయడానికి యాజమాన్యం అక్కడికి పంపిస్తోందని ఫోన్ చేసి చెప్పారు. అయితే ఈస్టర్ పండుగ కాబట్టి ఒక్కరే వెళ్లడం ఎందుకు, ఎవరైనా స్నేహితులను కూడా వెంటబెట్టుకుని వెళ్లమన్నారంటూ నాకు చెప్పారు. నన్ను గుర్తుపెట్టుకుని రమ్మన్నందుకు నేను చాలా సంతోషపడ్డాను.


కంపెనీకి చెందిన ప్రత్యేక ఫ్లైట్లో కుంబ్లేగారు, నేను, చారితో పాటు మరొక మిత్రుడు కలిసి వెళ్లాం. ఆ ప్రాంతం ఒక తూనీగలా ఉంటుంది. ఫ్లైట్ లో గంట ప్రయాణం తర్వాత ఒక అడవి ప్రాంతంలో దిగాం. మేం దిగిన తర్వాత లాడ్జి నుంచి ప్రత్యేక జీపు మా కోసం వచ్చింది. ఆ వాహనానికి పైన మాత్రమే టార్పాలిన్ లాంటి కవర్ ఉంది. అటూ.. ఇటూ.. ఏమీ లేదు, దాన్ని చూసి మేం డ్రైవర్ ను అడిగాం “అరణ్యం మధ్య నుంచి మమ్మల్ని తీసుకువెళ్తున్నావు కదా, ఇక్కడ చాలా మృగాలన్నీ తిరుగుతున్నట్టు ఉన్నాయి.. ప్రమాదం లేదా ?” అప్పుడు డ్రైవర్ అన్నాడు.. 'కొన్ని కొన్ని పార్కుల్లో జంతువుల ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అదే మసాయ్ మారా నేషనల్ పార్కులో మాత్రం మీరు ఇలాంటి జీపులో వెళ్లి ఉండేవారు కాదు. ఎందుకంటే మీరు ఈ పాటికే ఏ సింహం కడుపులోనో ఉండేవారు' అని చమత్కరించాడు. మేం కూడా అతనితో పాటు నవ్వుకుంటూ లాడ్జికి చేరాం. చాలా ఆకలి వేస్తూ ఉండడంతో మా కోసం ఏర్పాటు చేసిన వెజిటబుల్ శాండ్ విచ్ తిన్నాం. ఆ సమయంలో హోటల్ మేనేజర్ మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 'టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే 'మసాయ్' అని పిలిస్తే ఆ తెగకు చెందిన రక్షకుడు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు. కొసమెరుపుగా ఆయన మరొక విషయం చెప్పాడు. కొద్దిరోజుల క్రితం యూఎస్ నుంచి ఒక కుటుంబం వచ్చిందని, తాను చెప్పిన జాగ్రత్తలను ఆ ఫ్యామిలీలోని పిల్లలు పట్టించుకోకపోవడం ఒక పిల్లాడిని చిరుతపులో, సింహమే తినేసిందనడంతో మా అందరి గుండె ఝల్లుమంది. మాకు కేటాయించిన రూమ్ ఒక వైపు, క్యాబిన్ ఒకవైపు ఉంది. అప్పుడు ఇంకా చీకటి పడలేదు కాబట్టి మేము ఏమీ భయపడలేదు. ఈ లోపు కుంబ్లేగారు తాను వచ్చిన రిపేర్ పనిని చూసుకుంటానన్నారు. రేపు ఉదయం జంగిల్ సఫారీ ఏర్పాటు చేయాలని అక్కడి వాళ్లకు సూచించారు. ఈలోపు అక్కడ కూర్చుని మేం అంతా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. కుంబ్లేగారు రెండు గంటల పాటు కష్టపడ్డ తర్వాత ఆ కంప్యూటర్ రిపేర్ అయింది. రాత్రి అయిన తర్వాత మా కోసం మసాయ్ వచ్చాడు. క్యాబిన్ నుంచి రూముకు బయలుదేరాం. నేను మాత్రం కాస్త భయంతో అటూ ఇటూ చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాను. అక్కడ బలమైన టెంట్ ఏర్పాటు చేశారు. అదంతా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ స్నానం చేసి కాసేపు విశ్రమించి మేమంతా రెస్టారెంటుకు వెళ్లాం. ఈ లోపు రెస్టారెంట్ మేనేజర్ వచ్చారు. 'లాడ్జిలో దిగిన వాళ్లందరూ వస్తున్నారు, నెగడు కూడా వేస్తున్నాము' కాబట్టి కాసేపు సరదాగా గడపాలని కోరారు. దాంతో నేను, చారి గారు కూడా వెళ్లి అక్కడ చాలాసేపు సరాదాగా ముచ్చటించుకున్నాం. అక్కడ ఒక సరస్సు కూడా ఉంది. లాడ్జ్ మేనేజర్ దగ్గరున్న ఇన్ ఫ్రారెడ్ బైనాక్యులర్ తో సరస్సు అందాలను, అందులో ఉన్న హిప్పోపోటమస్ లను అందరికీ చూపిస్తున్నారు. కాసేపటి తర్వాత మేమంతా మళ్లీ మా క్యాబిన్ కు వెళ్లిపోయాం. ఉదయం నుంచి అంతా అలిసిపోయాం కాబట్టి డిన్నర్ చేసి పడుకున్నాం.




నాకు సాధారణంగా అడవులంటే ఇష్టం. ఆ వాతావరణంలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా వృత్తిలో ఎప్పుడూ ఆందోళనగా ఉండేది. అటువంటి ప్రపంచం నుంచి ఇలాంటి ప్రశాంతమైన అడవుల్లోకి రావడం, చెక్క గృహాల్లో నివాసం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే నేను ప్రకృతిని ఆస్వాదించేందుకు అక్కడున్న చెక్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చాను. కీచురాళ్ల ధ్వనులు, సరస్సును, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాను. అలా ఆలోచిస్తూ అక్కడే ఉన్న ఆరామ్ కుర్చీలో నిద్రామయ స్థితిలో ఉండగా, అకస్మాత్తుగా నాలో మంచి స్పందనలు అనుభూతిలోకి వచ్చాయి. నాకు మళ్లీ చాలా కాలం తర్వాత అయస్కాంత వ్యక్తి  దర్శనమైంది. ఏదో ఒక తెలియని హాయి మనస్సుకు అనిపించింది. ఆయనకు వినయంగా నమస్కరించారు. "నీకు ఇంకా చాలా విషయాలను చెప్పవలిసి ఉంది, అయితే పని ఒత్తిడిలో నీ మనసు వేరే ధ్యాసలో ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి ఇది నాకు అనుకూలమైన పరిస్థితి. నీకు కొన్ని విషయాలను చెప్తాను " అని అయస్కాంత వ్యక్తి అన్నారు. అప్పుడు “మహాత్మా ప్రశాంతంగా ఉన్న నాకు ఒక్కడికే మీరు కనిపిస్తారా లేక ప్రశాంతంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ మీ దర్శనం ఉంటుందా” అని అడిగాను. అప్పుడు ఆయన "మాకు ప్రతీ మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి, అద్భుతమైనటువంటి వాళ్లలానే కనిపిస్తారు. కానీ తటస్థ వైఖరి, జిజ్ఞాస ఉన్నవాళ్లకు, సంకుచితమైన ఆలోచనలకు దూరంగా ఉన్న నీలాంటివాళ్లకు మేం ఆకర్షింపబడతాం” అని ఆయన చెప్పుకొచ్చారు. “మీరు ఏ కొత్త విషయాలు తెలుసుకున్నా దాని గురించి ఆలోచిస్తారు, వెంటనే ఖండించరు, పరిపరివిధాల ఆలోచించి తటస్థ వైఖరిలో ఉంటారు కాబట్టే అలాంటివారి యొక్క తత్వానికి ఆకర్షితులవుతాం. అందుకే నేను నీకు కనిపిస్తున్నాను. నేను నీకు చెప్పిన విషయాలను నువ్వు జనాలకు వివరించాలి. నీలాంటి వాళ్లు వందలు, వేల మందికి మేం ఇలానే కనిపించి కొత్త విషయాలను చెప్తుంటాం. కానీ అది వాళ్లకు తెలియదు. వాళ్లే ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టు, కొత్త పనులు చేస్తున్నట్టు అనుకుంటారు. కానీ నేను ప్రతీ మానవుడిలోనూ ఉంటాను. నేను లేకుండా ఏ జీవి కూడా ఉండదు. నీలో, నీ మిత్రులలో, సమస్త ప్రకృతిలో వ్యాపించి ఉన్నాను. నేను అయస్కాంత క్షేత్రాన్ని కాబట్టి నేను లేకుండా ఏదీ ఉండలేదు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా అల్లకల్లోలంగా కనిపిస్తున్నాయి. పెద్ద పండితులు, మహానుభావులకే అనేక విషయాలు అర్థం కావడం లేదు" అన్నారు.
అప్పుడు నేను మహాత్మా 'నేను కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. అక్కడ ఒక గురువు గారు చెప్పిన మాటలకు విరుద్ధంగా మరొక గురువుగారు కొద్ది రోజుల తర్వాత మాట్లాడుతూ ఖండిస్తూ ఉంటారు. పరస్పర విరుద్ధ విషయాలను మేం తరచూ వింటూ ఉన్నాం కాబట్టి నాకు అర్థం కాని ఈ విషయాలను చెప్పమని' అయస్కాంత వ్యక్తిని నేను కోరాను. అప్పుడాయన అన్నారు "పుట్టినప్పటి నుంచి చాలామంది చాలా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎవరిని, నేను భూమిపైకి ఎందుకు వచ్చాను, భగవంతుడు ఉన్నాడా, నేను పోయిన తర్వాత ఏం జరుగుతుంది.. అనే ఆలోచనలతో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే చాలాసార్లు లౌకిక ఆకర్షణలకు లోనై మార్గం తప్పుతూ ఉంటారు. మహానుభావులు చెప్పిన ప్రతీ విషయానికీ విజ్ఞానపరంగా సాక్ష్యాధారాలు కావాలని వాళ్లంతా అడుగుతూ ఉంటారు. నేను చెప్పినట్టు ప్రతీ వెయ్యి సంవత్సరాలకు ఒకసారి భూఅయస్కాంత క్షేత్రంలో మార్పులూ వస్తూ ఉంటాయి. అప్పుడు పాత నమ్మకాలన్నీ పోయి కొత్త ఆచారాలు వస్తూ ఉంటాయి. అయితే చాలా మంది కొత్త అయస్కాంత క్షేత్రంలోకి రావడానికి భయపడుతూ ఉంటారు, జంకుతారు. కొన్ని తరాలు అలా జరిగిపోయిన తర్వాత వాళ్లు కొత్త క్షేత్రానికి అలవాటు పడిపోతారు. సామూహిక ప్రజాచైతన్యాన్ని బట్టే మార్పులు ఉంటాయి. ఒక దేశంలోని ప్రాంతంలోనే అనేక మార్పులుంటాయి. అలాంటిది ఒక దేశానికి, మరొక దేశానికి కూడా చాలా తేడాలుంటాయి. ఒక ఊరిలో ఒక ప్రాంతానికి చెందిన వాళ్లు ఒకలా, మరొక ప్రాంతానికి చెందిన వాళ్లు మరొకలా ఉంటారు. ఇది ప్రకృతిలోని మార్పు కాదు. ఆ ప్రాంత ప్రజాచైతన్యం బట్టే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం, లక్షణం మారుతూ ఉంటుంది. ఇక్కడ మంచి కానీ, చెడు కానీ భగవంతుడు నిర్ణయించడు. కేవలం అక్కడున్న ప్రజలే కారణం. అందుకే పరస్పర విరుద్ధమైన మార్పులు చూస్తూ ఉన్నాం. ఒక జాతి నమ్మిన విశ్వాసాన్ని ఇతరులు నమ్మకపోతే పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మికస్థాయిలో తక్కువగా ఉన్నవాళ్ల స్థితి. ప్రస్తుతం మనం మూడో భూమికలో ఉన్నాం. ఇంగ్లిష్ లో చెప్పాలంటే థర్డ్ డైమన్షన్ లో (third dimension) ఉన్నాం. 1987 నుంచి మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక భూమికలోకి ప్రజలు వెళ్తున్నారు. కొంతమంది చాలా ఉన్నతంగా పెద్ద భూమికలైన నాలుగు, ఐదో భూమికల్లోకి వెళ్తూ ఉంటారు. వారియొక్క ఆధ్యాత్మికస్థాయి వృద్ధి పరుచుకోకుండా మళ్లీ మూడో డైమన్షన్ లోకి వచ్చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయికి వెళ్తున్న వారిని మహాత్ములు, సత్పురుషులు, బుషులు అంటూ ఉంటాం. వారు మీలాగే పుట్టినప్పటికీ, నిరంతరసాధన చేస్తూ, పరమాత్మతతో అనుసంధానం కావడం వల్ల మహాత్ములుగా మారతారు. వాళ్లే సమాజంలో మార్పులు తీసుకువస్తారు.

ప్రస్తుతం రాజకీయ గందరగోళమే కాదు, ఆధ్యాత్మికంలోనూ గందరగోళం ఉంది. గురువులు పరస్పరమైన విరుద్ధ ప్రకటన చేయడం వల్ల కొంతమంది జనాలు కూడా వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. కేవలం మూడో భూమికలో ఉన్న జనాలు మాత్రమే ఒక వైపుకు అలా వెళ్లిపోతూ ఉంటారు. ఏ గురువు దగ్గర దైవీసంపద లక్షణాలు ఉంటాయో, ఎవరిదగ్గర బేధభావాలు ఉండవో వాళ్లను ఆశ్రయించాలి. వాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉంటూ బయటపడరు. ఎవరి దగ్గరికి వెళ్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఆత్మశాంతిగా ఉంటుందో, మంచి విషయాలపై ఆసక్తి ఉంటుందో, అటువంటి వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడే కలుగుతుంది. 1987 నుంచి కొత్త యుగం (new age) మొదలైంది. దీని అర్థం ఏంటంటే ఈ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం విశ్వమానవ యుగంగా మారుతోంది. దీనినే పోల్ షిఫ్టింగ్ అంటారు. అందుకే మానవుల్లో ఇలాంటి విపరీతమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా సమసిపోతాయి. 1987 తర్వాత పుట్టిన వాళ్లలో కొంతమంది నాలుగో, ఐదో డైమన్షన్ లో పుడతారు. అలాంటి వాళ్లు చిరుప్రాయంలోనే అద్భుతాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అద్భుతమైన చిత్రాలు గీస్తారు, మరికొంత మంది నేర్పుగా కారు నడుపుతారు, మరికొందరు పుణ్యతిధుల్లో ఉపవాసాలు ఉంటారు, కొందరు ఆసనాల్లో కూర్చుని భగవత్ ధ్యానంలో ఉంటారు. ఇటువంటి తత్వం ఉన్నవాళ్లు భూమిపై చాలామంది ఉన్నారు. వీళ్లే పూర్వం ఉన్నటువంటి పాత ఎనర్జీని మార్చేస్తూ ఉంటారు. ప్రతీ ఐదువేల ఏళ్లకు ఒకసారి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం చాలా ఎక్కువగా మారుతుంది. ఆధ్యాత్మికానికి జాతి, కుల, ప్రాంత, మత బేధాలు ఉండవు. ఎవరైతే నూతనశక్తిని ధరిస్తున్నారో, వాళ్లకు ఇవన్నీ పట్టవు. వాళ్లలో ఈర్ష్య,అసూయ ద్వేషాలు ఉండవు. తల్లిదండ్రులు ఇలాంటి వాళ్లను గుర్తించి వాళ్లకు మంచి విషయాలను చెప్పడం, నేర్పించడం, ఆచరించి చూపించడం వల్ల ఆ పిల్లలు గొప్ప వారు అవుతారు. ఈ సమాజంలో అనూహ్యమైన మార్పులు తెస్తారు. ముఖ్యమైన మొదటి ఏడు సంవత్సరాల్లో ఎవరైతే తమ పిల్లలకు మంచి సంస్కారం, ఆహార అలవాట్లను నేర్పిస్తారో వాళ్లు ఎంతో ఎత్తకు ఎదుగుతారు, లేకపోతే చెడు అలవాట్లకు బారినపడి సమాజాన్నీ ఇబ్బందిపెడతారు. వాళ్లను తట్టుకోవడం కూడా కష్టం. అందుకే తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకృతిలో ఉన్న ఆహారాన్ని మీరు గుర్తించి తీసుకున్నప్పుడు మాత్రమే మీ శరీరంలోని అయస్కాంత క్షేత్రం కూడా బాగుంటుంది. పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ల వ్యక్తిగత ఇష్టాలను పిల్లలపై రుద్ది తినిపిస్తారు. ఎక్కువ కారం, తీపి, మాంసభక్షణ వంటివి చేయిస్తారు. పూర్వజన్మ సంస్కారంలో వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల బలహీనత వల్ల వాళ్లపై రుద్దుతారు. వద్దని పిల్లలు ఎంత వద్దన్నా బలవంతంగా కొంతమంది తల్లిదండ్రులూ ఇస్తూ ఉంటారు. దీని వల్ల తామసిక భావాలు ఎక్కువైపోతాయి. లోపల ఉన్న కణాలన్నీ మారిపోతాయి. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. తర్వాత పిల్లలు ఎటువంటి వాళ్లతో సహవాసం చేస్తున్నారో గమనించుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీల్లో వచ్చే ప్రసారలను కూడా సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంచాలి. దీని వల్ల భావ కాలుష్యం ఎక్కువైపోతోంది. ఒక చిన్నారి లేత మనస్సులో ఒక భయంకర దృశ్యాన్ని చూపిస్తే వాళ్లు వేరే రకంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అదే వాళ్ల మనసులో ముద్ర వేసుకుని ఉంటుంది. మంచి ఆధ్యాత్మిక విషయాలను హాస్యాస్పదం చేయడం వంటివి పిల్లల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. జిహ్వకు రుచి కలిగినప్పుడు అది అలవాటుగా మారుతుంది. వీలైనంత వరకూ ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆహారాలను, సాత్వికఆహారాలను తీసుకోవాలి. అటువంటి వాళ్ల వల్ల సమాజం బాగుటుంది. ఎప్పుడూ మంచిగా మాట్లాడడం, వాగ్దోషాలు చేయకుండా ఉండాలి. 1987 తర్వాత ప్రజల్లో మంచి చైతన్యం వస్తుందని" అయస్కాంత వ్యక్తి వివరించారు.

అప్పుడు నేను ఇలా ప్రశ్నించాను 'ఈ విషయాలన్నీ నేను ఏ విధంగా చెప్పాలి. నాకు అటువంటి జ్ఞానంలేదు. సామాన్యుడిని కాబట్టి నేను చెప్పిన విషయాలు ప్రజలు నమ్ముతారని లేదు కదా. నన్ను ఎందుకు నమ్ముతారు. నేను ఎందుకు చెప్పాలి' అని అడిగాను. అప్పుడు అయస్కాంత వ్యక్తి అన్నారు "నువ్వు ఎవరినీ మార్చాల్సిన ఉద్దేశంతో చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి కుతూహలం, జిజ్ఞాస ఉన్న నీలాంటి వాళ్లకు చెప్పు. అప్పుడు వాళ్లలో ఉన్న సందేహాలకు నివృత్తి అవుతుంది. నీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయాలు వాళ్లకు చేరతాయి. అప్పుడు వాళ్లలో చైతన్యం వచ్చి మిగతా మార్గాలను అన్వేషిస్తారు. మనషులను నమ్మించే ప్రయత్నం మాత్రం చేయాల్సిన పనిలేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు. ఎవరికి ప్రాప్తం ఉంటుందో, ఎవరు ఈ శక్తికి ఆకర్షింపబడ్తారో వాళ్లకే తెలుస్తాయి. మూడో భూమికలో ఉన్నవాళ్లు పై స్థాయికి వెళ్తారు. అందుకని వేరే విషయాల గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి. ఏం జరుగుతుందో నీకు అనవసరం. నీకే కాదు ఎవరికైనా మేం ధ్యానస్థితిలో ఉన్నవాళ్లకు సమాధానాలు ఇస్తాం. కాకపోతే ప్రతీ విషయాన్నీ మీరు విమర్శగా చూసుకుంటే అన్ని విషయాలు మీకే బోధపడ్తాయి. ప్రస్తుతం ఇది సంధి గం. ఈ విపరీత పరిణామాలన్నీ తగ్గి 2020 సమయంలో మంచి మార్పులు జరుగుతాయి. ఎప్పటికప్పుడు మేము ఎవరికి ఇటువంటి జిజ్ఞాస ఉంటుందో వాళ్లను కలిసి ఈ విషయాలను చెప్తాం" అన్నారు.

సత్యం అనేది ప్రతీవారి నోట ఒకలా వస్తుంది. రంపా మహాశయులు కూడా ఇదే చెప్పారు, ఇప్పుడు ఈయన కూడా ఇదే చెబుతున్నారు. 'నేను ఆధ్యాత్మికంగా పై భూమికల్లో ఉన్న విషయాలను ఎలా చెప్పాలి. మూడో భూమికలో ఉన్న వాళ్లకు భాష ఉండదు కదా. పైస్థాయి విషయాలను కిందిస్థాయిలో వాళ్లకు ఎలా చెప్పాలి'. అని అడిగాను. "ఎవరు ఇటువంటి విషయాల పట్ల ఆకర్షింపబడతారో వాళ్లు ఇటువంటివన్నీ చక్కగా అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోరని నాకు చెప్పారు. తర్వాత ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ధ్యానస్థితిలో ఉంటావో అప్పుడు ధ్యానప్రసారాలను నీకు పంపిస్తూ ఉంటాను. ఈ మధ్య నీకు ధ్యానప్రక్రియపై ఆసక్తి తగ్గింది. అందుకే ధ్యానంపై దృష్టి కేంద్రీకరించమని చెప్పడమే కాకుండా త్వరలోనే కలుస్తానని" అయస్కాంత వ్యక్తి అదృశ్యమయ్యారు.

మళ్లీ ఉదయం కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత  అల్పాహారం ముగించుకుని కొంత ఆహారాన్ని తీసుకుని అడవిలోని సఫారీకి బయలుదేరాం. సింహాలు ఎదురైతే భయపడొద్దు, ఏమీ అరవొద్దు, ప్రశాంతంగా ఉండమని జీపు డ్రైవర్ మాకు ముందే సూచించారు. మార్గమధ్యంలో జింకలు, నక్కలు, జిరాఫీలు కనిపించాయి. గుబురుగా ఉన్న ఒక చోట ఒక ఆడ సింహం తన పిల్లలతో విశ్రమిస్తూ ఉంది. దాన్ని మేం గమనించాం. చారి గారు ఫోటోలు కూడా తీశారు. ఒక అరగంట సేపు అక్కడక్కడ చూసుకుంటూ వచ్చేశాం. మళ్లీ టాంజానియా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. అయస్కాంత వ్యక్తి, రంపా గారు చెప్పినట్టే ప్రతీ మనిషిలో అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. కొంత సాధన చేస్తే మూడో భూమిక నుంచి పైపైకి వెళ్లొచ్చు. సమాజ శ్రేయస్సుకు పాటుపడొచ్చు. మనం ప్రతీవ్యక్తిలో దైవాంశ ఉందని భావించినప్పుడు పరస్పర గౌరవభావంతో ఉంటారు. నాలాంటి వాళ్లు, నాకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్లకు రంపా, అయస్కాంత వ్యక్తి తారసపడి ఇలా బోధిస్తూనే ఉంటారని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

Monday 2 January 2017

చేదు నిజాలు - 000



Introduction to Chedu Nijalu

చేదు నిజాలు అనబడే శీర్షికలో అనేక ఆశ్చర్యకరమైనటువంటి, నమ్మలేనటువంటి అసలుసిసలైన భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు పేర్కొనబడతాయి. మన భారతదేశానికి మరి స్వాతంత్య్రం వచ్చింది అని ప్రజలందరూ సంతోషపడుతున్నపుడు మహాత్మా గాంధీ ఆరోజు ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు, కన్నీరు కార్చారు. కేవలం తెల్లవాళ్ళ నుంచి నల్లవాళ్ళకి అధికార బదలాయింపు జరిగింది కానీ మాన దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జవహర్ లాల్ నెహ్రు మొదటి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఉత్సవానికి కూడా మహాత్మా గాంధీ దూరంగానే ఉండిపోయారు.