పండిత శ్రీ రామ
శర్మ ఆచార్య – దయ్యాల కొంప
పరమ గురువు పండిత
శ్రీ రామశర్మ ఆచార్య గారు గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు . హరిద్వార్ లోని శాంతికుంజ్ , సప్తఋషులు తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశ౦ ,విశ్వామిత్రుడు గాయత్రి మాతని ప్రత్యక్షం చేసుకున్నటువంటి పవిత్ర భూమిలో ఆయన
గాయత్రి పరివార్ ని స్థాపించారు . శ్రీ రామశర్మ ఆచార్య గారు మధుర జిల్లాలో
అవల్ఖేడ్ అనే గ్రామంలో జమిందారీ కుటుంబంలో జన్మించారు . పదిహేనేళ్ళ ప్రాయంలో ఆయనకి
ఆయన గురువు గారైన సర్వేశ్వరానంద స్వామిని కలిసారు .
ఈ సర్వేశ్వరానంద
స్వామినే శ్రీపాద శ్రీ వల్లభులు హిమాలయా పర్వతాలలోని శంబల అనే ప్రదేశంలో కలుసుకుని ఆశీర్వదించడం జరిగింది . శ్రీ రామశర్మ గారికి వారి గురువు గారి అనుగ్రహం వలన గత మూడు జన్మలూ స్ఫురణకి వచ్చాయి . అందులో ఒకటి కబీర్ దాసుగా జన్మించటం ,రెండవది సమర్ధ రామదాసుగా జన్మించి శివాజీ గురువుగా హిందూ ధర్మ స్థాపనకి తోడ్పడటం , మూడవ జన్మ శ్రీ రామకృష్ణ పరమహంస గా అవతరించి ఎందరో సమాజానికి పనికి
వచ్చే మెరికల్లాంటి శిష్యుల్ని తయారు చేయడం గుర్తుకువచ్చింది . గురువు గారి ఆజ్ఞతో
తన జమిందారీ ఆస్తి పాస్తులన్ని అమ్మేసి మధుర కి వచ్చారు . అక్కడ గురువు గారి ఆజ్ఞ ప్రకారం పత్రికలద్వార విజ్ఞానాన్ని
అందించి తద్వారా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ఒక పత్రిక మొదలపెట్టాలన్న
సంకల్పంతో ప్రెస్సు పెట్టుకునేందుకు సౌకర్యంగా వుండే ఇంటికొరకు వెదకసాగారు. ఒక వృద్ధురాలి ఇల్లు అందుకు అనుకూలంగా వుండడంతో దానిని అద్దెకు
తీసుకున్నారు . అది రెండంతస్తుల మేడ ,క్రింద ఎనిమిది గదులు , పైన ఏడు
గదులు . గదికి రూపాయి చొప్పున నెలకి పదిహేను రూపాయలు . ముందుగానే అద్దె చెల్లించి
ప్రెస్సుకు కావాల్సిన సామాగ్రినంతా దానిలోకి తరలించారు . అంత పెద్ద మేడ అంత చవుకగా దొరికింది అని ఒక మూల సంతోషంగా ఉన్నా ,చాలా మంది వచ్చి “అయ్యా ! ఈ వూరికి మీరు కొత్తగా వచ్చినట్టు వున్నారు ,ఈ మేడ దయ్యాల కొంప, ఇక్కడ అద్దెకు వచ్చిన వారెవరూ ప్రాణాలతో లేరు ,అందుకే ఇది చవకగా అద్దెకు ఇచ్చారు ,మీరేమో విషయం తెలసుకోకుండా వచ్చారు , మరి జాగ్రత్త !” అన్నారు . కానీ శ్రీరామశర్మ ఆచార్య గారు అంత తక్కువలో
తొందరగా ఇల్లు దొరకడం కష్టం కాబట్టి అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నారు . తన
భార్యా పిల్లలూ , ప్రెస్సుకు కావాల్సిన సామాగ్రిని క్రిందనే అమర్చుకున్నారు .
కొద్ది రోజుల
తర్వాత అకస్మాత్తుగా అర్ధరాత్రి పూట మిద్దెపైన ఎవరో అటూ ఇటూ
పరిగెత్తుతున్నట్టుగానూ , చిన్నపిల్లల
ఏడుపులూ, అరుపులూ , కొట్లాటలూ , దెబ్బలాడు కుంటున్నట్టుగా వింత వింత శబ్దాలు వినిపించసాగాయి . అప్పుడు ఆయనకి అది నిజంగానే దయ్యాల
కొంప అని అర్ధం అయ్యింది . ప్రతి రోజు రాత్రి ఈ వింత వింత శబ్దాలకి
పిల్లలు భయపడుతున్నారు, ఇది ఏమిటో చూద్దాం అని లాంతరు తీసుకుని మేడ మెట్లెక్కి
పైకి వెళ్లారు . అప్పుడు ఆయనకి ఇంకా దగ్గరగా ఎవరో పరిగెడుతున్నట్టు ,ఏడుస్తున్నట్టు , గొడవపడుతున్నట్టు వింత శబ్దాలు వినిపించ సాగాయి
. కానీ ఆయన ధైర్యంగా “అయ్యలారా ! అమ్మలారా ! ఒక్క క్షణం ఆగండి ! చెప్పేది
వినండి !” అనగానే ఆ శబ్దాలన్నీ ఆగి పోయాయి . అప్పుడు ఆయన ఎంతో
ప్రశాంతంగా మీరు ఎన్నో ఏళ్ళ నుంచీ ఇక్కడ వుంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని
ఏవిధంగానూ ఇబ్బంది పెట్టదల్చుకోలేదు . అదే విధంగా మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది
పెట్టకూడదు . మనం ఒక ఒప్పందానికి వద్దాం , మేము క్రిందఎనిమిది గదుల్లో వుంటాం , మేమెప్పుడూ పైకి రాము , మీకు ఎటువంటి ఇబ్బందిని మేము కలిగించం. అదే విధంగా మీరు కూడా
పరిగెత్తటాలూ ,ఏడుపులు మానేసి పైన మీరు ప్రశాంతంగా వుండి మమ్మల్ని క్రింద ప్రశాంతంగా ఉండనివ్వండి” అన్నారు . ఆశ్చర్యంగా ఆ మరుసటి రోజునించి ఏ విధమైన చప్పుళ్ళు గాని, అరుపులు,
కేకలు, ఏడుపులు గాని వినపడలేదు .
అయితే అంతకు
ముందు ఎంతో మంది ఆ దయ్యాల కొంపలో దయ్యాల పాలబడి మృత్యు వాత పడ్డారు . కాని
శ్రీరామశర్మ ఆచార్య వారు గాయత్రి స్వరూపం.
కేవలం ఆవు పాలు , మజ్జిగ తో పచ్చి కూరగాయలు తింటూ ఇరవై నాలుగు
సంవత్సరాలు, 24లక్షలు *24లక్షలు గాయత్రి జపం , మంత్రోపాసన చేసారు . ఆయనకు ఆ గాయత్రి మాత ఎల్లప్పుడూ రక్ష గా వుండి
కాపాడుతుంది కాబట్టి అంత ధైర్యంగా అన్ని దయ్యాలు
ఉన్నటువంటి కొంపలో ఏమి లేనట్టు గానే ఉండగలిగారు . అది గాయత్రి మంత్ర మహిమ .